కరోనాపై వార్‌ : ప్రభాస్‌, ఎన్టీఆర్‌ భారీ విరాళం

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వల్ల భారతదేశంలో ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించింది.  కరోనాను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కొంతమంది టాలీవుడ్‌ హీరోలు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రూ. రెండు కోట్లు విరాళంగా ఇచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవి, మహేశ్‌బాబు చెరో  కోటి రూపాయలు  విరాళంగా అందజేశారు.  రామ్ చరణ్ 70 లక్షల రూపాయలు, నితిన్ 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. తాజాగా కరోనా కట్టడికి యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా తన వంతు సాయం అందించాడు.  కరోనాపై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా  కోటి రూపాయల విరాళం ప్రకటించారు.  ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌, తెలంగాణ రిలీఫ్‌ ఫండ్‌కి అందజేస్తున్నట్లు  ప్రభాస్‌ ప్రకటించారు.